Tuesday, August 24, 2010

మీఅందరి మధ్యలో పెరిగినోణ్ని .. తిరిగినోణ్ని..

 పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.

ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.

గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.

అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 


జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Sunday, August 22, 2010

రెచ్చగొట్టే ధోరణి ?

Jagan9
కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్‌ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్‌ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్‌ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్‌ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్‌ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్‌ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.

ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్‌ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్‌ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్‌ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్‌ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్‌ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్‌ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.

ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్‌ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.

జగన్‌ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్‌ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్‌ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్‌ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్‌ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్‌ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్‌ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్‌ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.

కౌంట్‌డౌన్‌ ! బల సమీకరణ మొదలు...

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

ఓదార్పు ఎంత లాభం ?

jagan-sir
తమను కలుసుకునేందుకు వచ్చిన వారితో ఓదార్పు యాత్రకువెళ్ళొద్దని చెప్పటమే తప్ప అధికారికంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ ప్రకటనా చేయని నేపథ్యం లో కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోమ, మంగళవారాలలో మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కడప జిల్లాలో, అందులోనూ ఆయన ఎంతో ఇష్టపడే పులివెందుల శాసనసభా స్థానం నుంచి ఈ యాత్ర మొదలు కావటం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదని హై కమాండ్‌ కరాఖండిగా తేల్చి చెప్పినట్టు కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, మరి కొందరు సీనియర్‌ నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం, యాత్రలో పాల్గొనవద్దని అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి రోశయ్య అందరితో చెబుతున్న నేపథ్యంలో జగన్‌ వాటిని గమనంలోకి తీసుకోకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాల మాట ఎలా ఉన్నా స్వంత జిల్లాలో తన సత్తా ఏమిటో హై కమాం డ్‌కు చూపాలన్న జగన్‌ ఆరాటం స్పష్టంగా బయటపడుతున్నది.

లాభ నష్టాల బేరీజు?
రెండు రోజుల ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం జగన్‌కు లేదు. అయితే సమీప భవిష్యత్తులో తాను రాజకీయంగా వేయబోయే అడుగులకు సానుకూల వాతావరణం స్వంత జిల్లాలో ఉందా లేదా అనే బేరీజు వేసుకోవ టానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తన యాత్రకు జనం మద్దతు ఉందని, ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండేది ప్రజలే కాబట్టి వారి కోరిక మేరకే యాత్ర జరుపుతున్నానని అధిష్ఠానానికి మరోసారి జగన్‌ గుర్తు చేయదలచుకున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో తనకు ఈ యాత్ర ఏమేర మేలు చేయగలదో బేరీజు సైతం వేసుకోనున్నారు.

అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి జిల్లాకు అందులోనూ పులివెందుల నియోజకవర్గానికి చేసిన మేలు అక్కడి ప్రజలు అంత సులభంగా మరచిపోరు. ఇడుపులపాయలో ఆర్‌జెయు గేట్‌ ఏర్పాటు చేయించి విద్యాపరంగా, బ్రహ్మాండమైన రహదారులకు నిధుల కేటాయింపు, సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం...ఇలా జిల్లాకు తన శక్తి మేరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయోజనాలనూ వైఎస్‌ సమకూర్చారు. ఫలితంగా ఆయన అన్నా, జగన్మోహన్‌రెడ్డి అన్నా జిల్లా ప్రజానీకానికి అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం జగన్‌ వేరు కుంపటి పెట్టుకున్నా కొనసాగుతుందా లేక అది కాంగ్రెస్‌ పార్టీ వైపు బదిలీ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్‌కు స్వంత జిల్లాలో ఎదురయ్యే అనుభవం పైనే తర్వాతి యాత్రల పరిస్థితి అంచనా వేయ వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వద్దంటున్నది ముగ్గురే...
జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి-టీడీపీ) మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వారే. అయితే ప్రాథమిక విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా సయ్యద్‌ (కడప), డీఎల్‌ రవీంద్రరెడ్డి (మైదుకూరు), జి.వీరశివారెడ్డి (కమలాపురం) తప్ప మిగిలిన ఆరుగురూ వైఎస్‌ వీరాభిమానులే...వైఎస్‌ స్థానంలో ఎన్నికైన జగన్‌ తల్లిగారు విజయమ్మ, కె.శ్రీనివాసులు (కోడూరు), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు), అమరనాథరెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేలు) ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన వరదరాజులు రెడ్డి లాంటి సీనియర్లు యాత్రకు దూరంగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. వైఎస్‌ జీవించి ఉన్నంత దాకా ఆయనకు తిరుగు లేదు కాబట్టి జిల్లాలో పలువురు సీనియర్‌ నేతలు ఆయనకు అండగా ఉన్నారు. డీఎల్‌ లాంటి వారు అలాంటి వారే. ఇప్పుడు ఆయన లేకపోవటంతో డీఎల్‌, వీరశివ లాంటి వారు గళాలు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్‌ నిర్వహించ తలపెట్టిన స్వంత జిల్లా ఓదార్పు యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కోవటంతో పాటు సమీప భవిష్యత్తులో ఆయన అనుసరించ బోయే వ్యూహాలకు సైతం నాందిగా నిలవనున్నది.

పులి జూదం.. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ సొంత గడ్డ పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటన

12 కుటుంబాలకు ఓదార్పు
ప్రకాశం యాత్రకు ముందు బల ప్రదర్శన
ఇది 'సెమీఫైనల్' అంటున్న నేతలు
సన్నిహితులతో జగన్ మంతనాలు
ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహం
నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం
గీత దాటే వారిపై వేటు ఖాయం!
ఈటెల్లాంటి మాటల వేట కొనసాగుతుండగానే, అసలు ఆటకు తెర లేస్తోంది. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలను తోసిరాజంటూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్, ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఓదార్పును పార్టీపరంగా చేయాలన్న హైకమాండ్ హితబోధను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగతంగానే యాత్రకు వెళ్లబోతున్నారు.

స్వస్థలమైన కడప జిల్లాలో, కంచుకోట వంటి పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటించబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 12 మంది కుటుంబాలను ఆయన ఈ సందర్భంగా ఓదారుస్తారు. ఓదార్పునకు సంబంధించిన కార్యాచరణపై జగన్ ఆదివారం పలువురు నేతలతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి మరుసటి రోజు నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టి తీరాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు ముగిశాక, సంధి-సయోధ్య కోసం జరిగిన పలు యత్నాలు విఫలమైన నేపథ్యంలో... దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కడప జిల్లాలో పర్యటన తలపెట్టడం ద్వారా జగన్, అధిష్ఠానానికి నేరుగా సవాలు విసురుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టే యాత్రకు ముందే, సొంత జిల్లాలో సత్తా చాటడం జగన్ లక్ష్యమని వారు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో జగన్ యాత్రను 'సెమీ ఫైనల్'గా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక 'ఫైనల్'కు చేరుకునే దాకా... అం టే ప్రకాశం యాత్ర చేపట్టే సెప్టెంబర్ 3 దాకా అధిష్ఠానం ఆగుతుందా? లేక ఆ లోగానే చర్యలు తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని స్పష్టం చేసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, ఏకంగా 'జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?' అని వ్యాఖ్యానించడంతో, గీత దాటితే జగన్‌పై క్రమశిక్షణ చర్య తప్పదని స్పష్టమైంది. అయితే అది ఎప్పుడు? ఎవరు ముందుగా అడుగు ముందుకు వేస్తారు? అన్నవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.

వ్యూహ ప్రతివ్యూహాలు
ఆఖరి అంకానికి సమయం సమీపిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో తీవ్రమవుతోంది. పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కేశవరావు, హర్షకుమార్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి వారు ఒకవైపు మోహరించగా, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డి, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటివారు మరోవైపు మోహరించారు.

స్థూలంగా చూస్తే, ఇప్పుడు పార్టీలో హైకమాండ్ వర్గం, జగన్ వర్గం అనే రెండు గ్రూపులు, వాటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ప్రధానమని అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, వైఎస్ తనయుడిగా ప్రజల్లో కరిష్మా ఉ న్న జగన్ వెంట వెళ్లేందుకే తాము మొగ్గు చూపుతామని ఆయన వర్గం చెబుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు మాత్రం అధిష్ఠానం మాటను శిరసావహిస్తామని స్పష్టంచేస్తున్నారు.

దీంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు జగ న్ వర్గం ఒత్తిడిని పెంచుతోంది. ఈ వర్గానికి చెందిన వారు గత 2 రోజులుగా కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. "వైఎస్ వల్లే అసెంబ్లీకి ఎన్నికైనందున, శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు'' అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ప్రజా ప్ర తినిధుల్లో అత్యధికులు అధిష్ఠానం బాట పట్టడంతో, జగన్ వర్గం, జిల్లాల వారీగా కింది స్థాయి నాయకులతో మాటా మంతీ జరుపుతోంది. పంచాయతీల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ ఓదార్పు యాత్రకు అనుకూలంగా తీర్మానాలు చేయిం చి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు కూడా ఓదార్పును అధిష్ఠానం ఏ మాత్రం వద్దన లేదని, జిల్లా కేంద్రంలో బాధితులతో కలిపి పార్టీ పరంగా చేయాలని చెబుతోందని, అయితే జగన్ అందుకు అంగీకరించడం లేదని కార్యకర్తలకు వివరిస్తున్నారు.

మరోవైపు 'తిరుమలలో అక్రమాలు- తనపై ఆరోపణల'కు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి జగన్ వర్గీయులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం లో ఇప్పటి నుంచే వేడి రాజేస్తున్నారు. యాత్ర జరిగే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ పర్యటిస్తూ, దగ్గుబాటి దంపతులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ, కాక పుట్టిస్తున్నారు.

రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం, కట్టుదాటిన వారిపై క్రమశిక్షణ వేటు వేసేందుకే సిద్ధమవుతున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. రెండు వర్గాలూ దేనికవి పట్టిన పట్టు వీడకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండడంతో, ఈ నెలాఖరులో, సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Friday, August 13, 2010

వద్దే వద్దు! పార్టీ నేతలకు సోనియా ఆదేశం - కేంద్ర మంత్రి ద్వారా సందేశం

 
తాడోపేడో తేల్చేందుకే సిద్ధం
జగన్ వెంట ఎందరున్నారని ఆరా
వ్యతిరేకుల స్వరానికి ప్రోత్సాహం
ముందుకే వెళతానంటున్న జగన్
ప్రకాశంలో యాత్ర పొడిగింపు!
వైఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ
మళ్లీ ఆదేశం.... ఈసారి ఏకంగా అధినాయకురాలి నుంచే!
అదే నిర్దేశం... పార్టీ శ్రేణులన్నింటికీ స్పష్టమైన సందేశం!
'ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వాదులెవరూ పాల్గొన వద్దు!'
ఇదీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జారీ చేసిన తాజా హుకుం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి మరుసటి రోజు (సెప్టెంబర్ 3) నుంచి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు (మూడో విడత) యాత్రను కొనసాగించాలని కడప ఎంపీ జగన్ నిర్ణయించుకోవడంతో ఇక మేడమ్ సోనియగాంధీయే రంగంలోకి దిగారు. యాత్రకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దని, తన మాటగా దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని ఆమె ఓ కేంద్ర మంత్రికి సూచించారు. సదరు కేంద్ర మంత్రి శుక్రవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో సోనియాను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కేంద్ర మంత్రి: ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై పార్టీ వాదుల్లో అయోమయం ఉంది. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి ఇంతవరకూ స్పష్టత లేదు. సోనియా: అయోమయం లేనే లేదు. ఓదార్పు యాత్రలో మీరు పాల్గొనొద్దు. మీరు పాల్గొనక పోవడమే కాదు; మీ తోటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కూడా, యాత్రకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పండి.

కేంద్ర మంత్రి: యాత్ర విషయంలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపిీలు, మంత్రులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. సోనియా: ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పండి. వారికి అండగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అని, వారికి ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇవ్వండి.

కేంద్ర మంత్రి: ఎమ్మెల్యేలకు మా స్థాయిలో మేం చెబుతాం. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఈ విషయంలో పార్టీ నేతలకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదు. పైగా ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా: ఏడీ? వీరప్ప మొయిలీ ఎక్కడ? ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పిన సోనియా, అన్నట్టుగానే తర్వాత మొయిలీని పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మొయిలీ విలేఖరులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓదార్పు గురించి మాట్లాడడానికి నిరాకరించారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి జగన్ యాత్ర చేస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.

సోనియాతో గురువారం నాటి తన సమావేశం వివరాలు మీడియాలో రావడం పట్ల మొయిలీ అసహనం వ్యక్తం చేశారు. కాగా జగన్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా ఉన్నారని సదరు కేంద్ర మంత్రిని సోనియా ఆరా తీశారు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా బహిరంగంగా, గట్టిగా మాట్లాడే వారు రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారని కూడా మేడమ్ అడిగినట్టు సమాచారం. అలాంటి వారిని గుర్తించి, తనకు తెలియజేయాలని, వారిని ప్రోత్సహిద్దామని ఆమె అన్నట్టు తెలిసింది.

మొత్తమ్మీద వద్దన్నా యాత్రకు వెళుతున్న జగన్ విషయంలో అధిష్ఠానం క్రమంగా పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయని సోనియా, స్వయంగా రంగంలోకి దిగడం హైకమాండ్ సీరియస్‌నెస్‌ను సూచిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని హైకమాండ్ త్వరలోనే చక్కదిద్దబోతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గీత దాటితే సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెబుతున్నారు.

హైదరాబాద్: అధిష్ఠానం వైఖరి ఎలా ఉన్నా, ఓదార్పు యాత్రలో ముందుకు వెళ్లడానికే జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. యాత్రలో పార్టీ వాదులు పాల్గొన వద్దన్న సోనియా నిర్దేశం వెలువడిన కొద్ది గంటల్లోనే జగన్, ఓదార్పు ఆపే ప్రసక్తే లేదని సన్నిహితులకు స్పష్టంచేశారు. అంతేకాదు, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ముందు అనుకున్నట్టుగా వారం రోజులు సరిపోదని, పొడిగించాలని నిర్ణయించడం గమనార్హం.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్‌ను ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన వైఎస్ సంస్మరణ సభ పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర విషయం చర్చకు వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాల స్థాపనకు కార్యకర్తలు పట్టుబడుతున్నందున యాత్రకు వారం రోజులు చాలదని, చాలా రోజులు పట్టేలా ఉందని జగన్ పేర్కొన్నారు. అధిష్ఠానం అవునన్నా కాదన్నా ఓదార్పు ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అటు నెల్లూరు యాత్రకూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ మేకపాటి సోదరులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది ఆనం (రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి) సోదరులకు మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో జగన్, ఆనం సోదరులను ఇప్పటి వరకూ సంప్రదించకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం తాజా నిర్దేశం నేపథ్యంలో జగన్ ప్రకాశం యాత్రలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన యాత్రలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొన లేదు. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రకాశంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఓదార్పు జగన్‌ వ్యక్తిగతం... పార్టీ నేతలు పాల్గొనవద్దు... అధిష్టానం వైఖరి...



కడప నియోజకవర్గం ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రపై మరోసారి కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌ అయ్యింది. ఓదార్పుయాత్ర జగన్‌ వ్యక్తిగతమని, పార్టీ నేతలు ఎవరూ ఆ యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అనుచరులతో జగన్ భేటీ...
వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ఈరోజు ముఖ్య అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ రెండున తిరుపతిలో జరిగే వై.ఎస్. రాజశేఖర్‌రె డ్డి వర్ధంతి పోస్టర్లను జగన్ విడుదల చేశారు. కాంగ్రెస్ నేత టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ జనహృదయ నేత వైఎస్‌కు తిరుపతిలో చాలా మంది అభిమానులు ఉన్నారన్నారు.

ఈ సంస్మరణ సభలో 25వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు : బాలినేని

  కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మూడు నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర యధాతథంగా జరుగుతుందని అన్నారు. ఈ యాత్రంలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. యాత్ర కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మంత్రి బాలినేని పేర్కొన్నారు.