Sunday, November 7, 2010

జన సునామీ * ఓదార్పుకు స్పందన అనూహ్యం

బంగాళాఖాతంలో‘జల్’పెను తుపాను.. తీరంలో అల్లకల్లోలం... జిల్లా వ్యాప్తంగా వర్షాలు... ఇది ఆదివారం ఉదయం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పుయాత్ర ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగు తుందోనని ఆయన అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.

ఉదయం నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు. సాధారణంగా వర్షం కురిస్తే మోకాటిలోతు నీళ్లు నిలిచే నెల్లూరు ప్రధాన రోడ్లు, వీధులు ‘జన’మయమయ్యాయి. వర్షం వస్తే బోసిపోయే రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. జోరు వర్షంలోనూ కదలని జనం. కురుస్తున్న వర్షం చినుకులు రోడ్డు మీద పడని పరిస్థితి. ఇదీ ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటరులో కనిపించిన దృశ్యాలు.

యువనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో చివరిరోజు ఓదార్పుయాత్రను నిర్వహించారు. అభిమానులు కడలి కెరటాల్లా తరలివచ్చి యువనేతకు నీరాజనం పలికారు. కటౌట్లు, ఫ్లెక్సీ బోర్డులు, భవనాలు, మిద్దెలు, దుకాణాలు, ట్రాఫిక్ డివైడర్లు, ఐల్యాండ్లు ఇలా ప్రతి చోటూ జనంతో నిండిపోయాయి. యువతనేతను ఆత్మీయంగా పలుకరించాలని ఉదయం నుంచి నగరవాసులు ఎదురుచూశారు, బొకేలు, పూలమాలలు చేతబట్టి రోడ్లపై చేరారు.
నెల్లూరు నగరంలోని మనోహర్‌రెడ్డి నివాసం నుంచి జిల్లాలో చివరి రోజు ఓదార్పుయాత్రను జగన్ ప్రారంభించారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులతో మనోహర్‌రెడ్డి నివాసం కిక్కిరిసిపోయింది.

అక్కడకి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగిన జగన్ నీలగిరి సంఘానికి చేరుకుని మహబూబ్‌బాషా కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌కు బయలుదేరిన జగన్‌పై అడుగడుగునా జనం అభిమానం కురిపించారు. చిరుజల్లులు కురుస్తున్నా జనం ఖాతరుచేయలేదు. విద్యార్థులు, యువకులు, చిన్నారులు, మహిళలు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మహిళలు జగన్‌కు దిష్టి తీయడంతో పాటు మంగళ హారతులిచ్చారు. అభిమాన బంధాలను దాటుకుంటూ జగన్ గాంధీబొమ్మ సెంటర్ సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికే గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్, కనకమహాల్ సెంటర్, ఏసీ సెంటర్‌ల వరకూ జనం కిటకిటలాడుతున్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో తరలివచ్చిన జనం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ప్రతి ఒక్కరూ జగన్ చేతి స్పర్శ కోసం పోటీపడ్డారు. వాహనాన్ని విగ్రహావిష్కరణ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

జగన్ వేదికపైకి చేరుకోగానే ఆ ప్రాంతం కాబోయే సీఎం..జగన్ అనే నినాదాలతో హోరెత్తింది. అనంతరం నిలువెత్తు వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటికే వర్షం మొదలైనా జనం లెక్కచేయలేదు. జగన్ చేసిన ప్రసంగాన్ని వింటూ విశేషరీతిలో స్పందించారు. జగన్ ప్రసంగం మొదలైన సమయంలో తుంపర్లుగా పడుతున్న వర్షం ముగిసే సమయానికి జోరువానగా మారింది. అయినప్పటికీ జనం వెనకడుగు వేయకుండా ఆసక్తికరంగా సాగిన జగన్ ప్రసంగాన్ని విన్నారు.

చివర్లో సీఎం..సీఎం...సీఎం..సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, సినీ నటి రోజా, సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు. గట్టు రామచంద్రరావు, పుల్లా పద్మావతి, కాటం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, రెహమాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరుల ప్రసంగాలకు కూడా జనం నుంచి విశేష స్పందన లభించింది. జోరువాన కురుస్తున్నా జగన్ అక్కడి నుంచి వెళ్లేంత వరకు జనం కదలకపోవడం విశేషం. అక్కడి నుంచి డైకస్‌రోడ్డు సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

వర్షంలోనూ ప్రజలు హాజరుకావడంతో వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. వైఎస్సార్‌పై ఇంతటి ఆదరాభిమానాలను ప్రదర్శించడం హర్షణీయమన్నారు. సీఏఎం స్కూలు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ వైఎస్సార్‌పై స్థానిక ముస్లింనేత ఆలపించిన గీతాన్ని జగన్ ఎంతో ఆసక్తిగా విన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జేకేరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సన్నీ హైట్స్ హోటల్ అధినేత బలరామిరెడ్డి నివాసంలో భోజనానికి హాజరయ్యారు. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు, వెంకటాచలం మండలం గొలగమూడి, అనికేపల్లి, తిక్కవరప్పాడులలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి చెన్నైకు బయలుదేరారు.
నగరంలోని బట్వాడిపాళెం చర్చిలో జననేత ప్రార్థనలు చేశారు. తదుపరి కనుపర్తిపాడు వెళుతూ మార్గమధ్యలో మాజీ కౌన్సిలర్ మాథ్యుస్ కోరిక మేరకు కొండాయపాళెం బాప్టిస్టు చర్చి వద్ద ఆగారు. చర్చిలో ప్రార్థన చేసి మతపెద్దలు ఆశీస్సులు పొందారు. 
 
ఓదార్పుకు స్పందన అనూహ్యం
ఓదార్పుయాత్రలో భాగంగా యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలో ఓదార్పుయాత్ర ప్రారంభం నుంచి ప్రజల హృదయాలను తాకేలా ఆయన మాట్లాడారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి చోటా ఆయన ప్రస్తావించారు. ఆ పథకాల పేర్లను ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఒక్కో పథకం పేరు చెబితే చాలు జనంలో నుంచి వైఎస్సార్..వైఎస్సార్..వైఎస్సార్ అని సమాధానం వచ్చేది.

దివంగత నేత వైఎస్సార్ మాదిరిగానే 108 వాహన సేవలను వివరించినప్పుడు ఆయన చెప్పే కుయ్..కుయ్..కుయ్ పదాలకు జనం కూడా శృతి కలిపారు. ప్రధానంగా జగన్ ఉచ్చరించే గుర్తుకొస్తూనే ఉంటారు...అనే మాటకు జనంలో నుంచి కేరింతలు వెల్లువెత్తాయి. ఆయన తన ప్రసంగాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ పథకాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రెండు రూపాయలకే కిలోబియ్యం, పావలా వడ్డీకి రుణాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను వివరించినప్పుడు జనం మరొక్కసారి దివంగతనేత వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు.

జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ విగ్రహా విష్కరణ కార్యక్రమాల్లో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తమకు వైఎస్సార్ చేసిన మేలును వివరించేందుకు వేదికల మీదకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమకు రెండు నిమిషాలు అవకాశమిస్తే మహానుభావుడు వైఎస్సార్ చేసిన ఉపకారాన్ని వివరించి తృప్తి పడతామని కోరారు. జగన్ వారందరికీ అవకాశం కల్పించారు. అలా వారు చేసిన ప్రసంగాలకు జగన్‌తో పాటు జనం కూడా మురిసిపోయారు.
ముగింపు ప్రసంగం అదరహో..

ఓదార్పుయాత్ర ఆఖరురోజైన ఆదివారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహా విష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ఓదార్పుయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ అవాకులు, చవాకులు పేలుతున్న వారిపై నిప్పులు చెరిగారు. కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావులు ఏం చేశారని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌ను ఒంటరి చేయలేరన్నారు. ప్రతిపక్షం కంటే స్వపక్షనేతలే తనపై అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు తనను నమ్ముకున్న వారిని పథకం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్నవారికి నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇలా చేయడం న్యాయమా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి కాదు..కాదు..కాదు..అని జనంలో నుంచి సమాధానం వచ్చింది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నిన వారి పాపాలు పండి.. వచ్చే ఉప్పెనలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ విధంగా జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలూ అదే స్థాయిలో స్పందిం చారు. మేమున్నామంటూ నినాదాలు చేశారు. చివర్లో కాబోయే సీఎం..కాబోయే..కాబోయే సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంపై పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు. 
 
ఓదార్పులో ప్రముఖులు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో 23 రోజుల పాటు నిర్వహించిన ఓదార్పుయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, మూలింటి మారెప్ప, సినీ నటి రోజా, సినీనటులు ధర్మవరపు సుబ్రమణ్యం, విజయ్‌చందర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, వైఎస్సార్ జిల్లా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కందుల రంగారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ఆర్. ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్, ఎమ్మెల్సీలు రెహమాన్, పుల్లా పద్మావతి, కొండా మురళి, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్, లాయర్ పత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్లు డేగా నారసింహారెడ్డి, బాలచెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, అల్లాడి సతీష్ కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రజని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు జీవీ ప్రసాద్, ఇసనాక సునీల్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, కండ్లగుంట వెంకటేశ్వర్లురెడ్డి, కన్నపరెడ్డి అమరనాథ్‌రెడ్డి, అంకినపల్లి ఓబుల్‌రెడ్డి, కోనంకి శ్రీనివాసులునాయుడు, శివారెడ్డి, సాయిరాంరెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్ అభిమన్యుడు కారు, పద్మవ్యూహం ఛేదించే అర్జునుడు: రోజా

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసత్వం అందించే నాయకులు రాష్ట్రంలో లేరని, ఆ వారసత్వాన్ని వైయస్ జగన్ పుణికిపుచ్చుకున్నారని, తండ్రుల వారసత్వాన్ని తీసుకునేవారు చాలా కొద్ది మంది ఉంటారని, జగన్ ఆ వారసత్వాన్ని తీసుకున్నారని రోజా అన్నారు.

వైయస్ జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించారని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు వైయస్ జగన్ ముందుకు వచ్చారని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జగన్ వేరేవారిని పంపించి బాధితులకు సహాయం అందివచ్చు కానీ ఆత్మీయ పలకరింపు కోసం, మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్రానికి, పార్టీకి మంచిదని ఆమె అన్నారు.

Tuesday, November 2, 2010

ఎల్లల్లేని అభిమానం

పార్టీలకు అతీతంగా వైఎస్ విగ్రహాల ఏర్పాటు
అభిమాన ప్రవాహంలో కొట్టుకుపోతున్న ‘అడ్డంకులు’
విగ్రహావిష్కరణలకు అశేషంగా తరలివస్తున్న జనం
18వ రోజు ఓదార్పుకు అడుగడుగునా నీరాజనం



ప్రేమకు, అభిమానానికి ఎల్లలుండవు.. అందుకే వైఎస్.. పేదలపై తన అభిమానాన్ని సంక్షేమ పథకాల ద్వారా చాటుకున్నారు. ఏ పార్టీ కార్యకర్త అని చూడకుండా ప్రతి పేదోడికీ లబ్ధి కలిగేలా చేశారు. విపక్ష నియోజకవర్గమైనా అభివృద్ధికి లోటు లేకుండా నిధులిచ్చారు. దాంతో వైఎస్‌కు అభిమానులుగా మారిన ప్రజలిప్పుడు తమ అభిమానాన్ని విగ్రహాల ఏర్పాటు ద్వారా చాటుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా తమ ఆప్యాయతను కనబరుస్తున్నారు. దాన్ని ఏర్పాటు చేయడానికి అధికార పక్షం, స్వపక్షం నుంచి అడ్డంకులు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తున్నారు. అలా ఏర్పాటైనవాటిలో ఒక విగ్రహాన్ని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్పు యాత్రలో ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి జరిగిన పోరాటం చాలా ఉంది. దువ్వూరు గోపాలకృష్ణారెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు దాని కోసం చాలా కృషి చేశారు.

ఆయన భార్య శకుంతలమ్మ నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం ముల్లూరు గ్రామ సర్పంచ్. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో ఈ ఊరు ఊరంతా బాగుపడింది. ఈ నేపథ్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహం పెట్టాలని అనుకున్నారు. స్థానిక అగ్ర నాయకత్వం అంగీకరించ లేదు. అయితే గోపాల కృష్ణారెడ్డి రాజకీయాలు పక్కనబెట్టారు. మహానేత విగ్రహం పెడితే ఖర్చులు తాను భరిస్తానని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలను అర్థించారు. వారు ముఖం తిప్పుకున్నారు. గోపాల కృష్ణారెడ్డి తానే వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు సొంత పార్టీ అభ్యంతరం చెప్పింది. మానవత్వం లేని అభ్యంతరాలను తాను పట్టించుకోనని తెగేసి చెప్పారు. ముత్తుకూరు సెంటర్లో విగ్రహం పెట్టడం కోసం గ్రామ పంచాయతీ స్థలం అడిగారు.

అధికార మదం ఒప్పుకోలేదు. అదే సెంటర్‌కు కొద్ది దూరంలోనే ఉన్న తన సొంత స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. భూమి పూజ చేశారు. ఆటంకాలు రెట్టింపయ్యాయి. అంతకు మించిన మానసిక ఒత్తిడి. భూమి పూజ చేసిన సరిగ్గా నాలుగు రోజులకు గోపాలకృష్ణారెడ్డి గుండె ఆగిపోయింది. విగ్రహ నిర్మాణం నిలిచిపోయింది. తండ్రి చివరి కోరికను ఆయన ముగ్గురు కొడుకులు భుజానికెత్తుకున్నారు. ఇబ్బందులను భరిస్తూనే విగ్రహ నిర్మాణం చేశారు. 18వ రోజు మంగళవారం ఓదార్పు యాత్రలో భాగంగా యువనేత జగన్ దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం గొప్ప కాదు. చనిపోయిన తరువాత ఎంతమంది గుండెల్లో బతికున్నామన్నదే గొప్ప’ అని అన్నారు. ప్రసంగించటానికంటే ముందు గోపాలకృష్ణారెడ్డి ఆత్మ శాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. అదే వేదికపై గోపాలకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్‌ను వీడబోను’ అని ప్రమాణం చేశారు. ఈ విగ్రహావిష్కరణకు రాజకీయ పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. కాని ప్రజలు మాత్రం భారీ ఎత్తున పోటెత్తారు. యువనేతతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిక, నేర్నూరు, ఉదయగిరి మండలం కొత్తపల్లి, లింగంనేనిపల్లి, దేపూరుపల్లి, కోవూరు పెద్దసాయిబాబా గుడిసెంటర్‌లలోనూ విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలే వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే జగన్ వాటిని ఆవిష్కరించారు.
సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కొత్తూరు చింతోపులో ఏల్చూరి నారయ్య కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్ ఇందుకూరు మండలం పోట్లపాడులో బసచేశారు. మంగళవారం పోట్లపాడు నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు.

ముంగళదోరువు మీదుగా పేడూరుకు చేరుకుని దళిత వాడలో దువ్వూరి రామయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి యాత్ర పాపిరెడ్డిపాలెం, తోటపల్లిగూడూరు, వరిగుండం, ముత్తుకూరు, సుబ్బారెడ్డిపాలెం, పంటపాలెం గ్రామాల మీదుగా రాత్రి ఏడు గంటలకు దొరువుల పాలెం పంచాయతీలోని రొయ్యలపాలెం చేరుకుంది. ఇక్కడ జగన్ నెల్లిపూడి వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం వెంకటాచలం మండలం నిడుగుంటపాలెం మీదుగా రాత్రి 11 గంటలకు సర్వేపల్లి చేరుకున్న యువనేత అక్కడ వర్షంలో తడుస్తూనే విగ్రహావిష్కరణ చేశారు. అక్కడి నుంచి 11:45 గంటలకు పూడిపర్తి గ్రామం చేరుకున్నారు. ఇక్కడ రాత్రి 12 గంటలకు సారంగం సురేష్ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత కూడా ఓదార్పు యాత్ర కొనసాగింది.

చిన్న పల్లెలో ‘పెద్ద మనసులు’...

మంగళవారం ఓదార్పు యాత్ర పూర్తిగా పల్లెల్లోనే కొనసాగింది. చిన్న చిన్న పల్లెలు అయినప్పటికీ ప్రజలు మాత్రం భారీ ఎత్తున హాజరయ్యారు. యువనేత వస్తున్నారని ముందే తెలియడంతో ప్రజలు పనులు వదిలేసి జగన్ కోసం ఎదురుచూశారు. వృద్ధులు లేని సత్తువ కూడదీసుకొని గంట ముందే విగ్రహావిష్కరణ వేదిక వద్దకు వచ్చారు. కుటుంబ సమేతంగా ఎదురు వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమతమ ప్రిన్సిపాళ్ల అనుమతితో ఐచ్ఛిక సెలవులు తీసుకున్నారు. జగన్ ఆటోగ్రాఫ్ కోసం వారు ఎగబడ్డారు. ప్రతి విద్యార్థికీ కూడా జగన్ ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

జగనన్నకు జై..జై..జై..జై...
ముంగళదోరువు గ్రామంలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తికాగానే అన్నా నేను మాట్లాడుతా అంటూ శివయ్య అనే బాలుడు మైకు అందుకున్నాడు. ‘నాన్న గారికి యాక్సిడెంటు అయింది. రెండు కాళ్లు పోయాయి. రాజశేఖరరెడ్డిగారు ఆరోగ్యశ్రీ పెట్టారు. మా నాన్నకు కాళ్లు వచ్చాయి. నడుస్తున్నారు. జగనన్నకు జై...జై..జై.. అంటూ ఘంటాపథంగా అరవడం మొదలు పెట్టాడు. ఎవరు వారించినా బుడతడు వినలేదు, నేతలు మైకు లాక్కునేందుకు ప్రయత్నించినా వాడు చిక్కలేదు. జై..జై..జై..’ అంటూనే వేదిక దిగిపోయాడు.

ఆయన పుణ్యం...

ముత్తుకూరులో వైఎస్‌విగ్రహావిష్కరణ అనంతరం.. 85 ఏళ్ల షేక్ నాజ్‌నిషాబేగం కర్ర పొడుచుకుంటూ వేదిక మీదకు వచ్చింది. నేను మాట్లాడుతా మనవడా అంటూ జగన్ వద్ద నుంచి మైకు తీసుకుంది. ‘నాయినా ఆ అయ్య బతికుంటే నాకు *500 పింఛను ఇచ్చు. నాయిన పుణ్యం ఇదిగో ఇల్లు కట్టుకున్న. నా నాయిన వచ్చిండు’ అంటూ జగన్‌ను ముద్దు పెట్టుకుంది.

మంగళవారం జగన్ వెంట ఓదార్పులో పాల్గొన్న వారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సత్యవీడు మాజీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, కర్నూల్ జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్‌రెడ్డి, విజయా డైరీ చైర్మన్ చిల్లకూరి సుధీర్‌రెడ్డి, స్థానిక ‘లాయర్’ పత్రిక సంపాదకులు తుగా శివప్రభాత్‌రెడ్డి, పీఆర్పీ యువరాజ్యం జిల్లా అధ్యక్షుడు బట్టెపాటి నరేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు టంగుటూరి శ్రీనివాసరెడ్డి, సాయికృష్ణారెడ్డి పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఆ బాధ నాకు తెలుసు...

రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక పేడూరు అరుంధతీయకాలనీలో మరణించిన దువ్వూరి రామయ్య కుటుంబ సభ్యులను జగన్ మంగళవారం ఓదార్చారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఎంత బాధ, కష్టమో తనకు తెలుసునని, ఏ కష్టమొచ్చినా తాను ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అవసరమైనప్పుడు తనకు ఫోన్ చేయాలంటూ వారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని రామయ్య భార్య కామాక్షమ్మకు సూచించారు. యువనేత జగన్ తమ కుటుంబ సభ్యులను ఓదార్చడం మర్చిపోలేని విషయమని కామాక్షమ్మ, రామయ్య తల్లి మరియమ్మ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ఆయన భరోసాతో తమ కుటుంబానికి కొండంత అండ దొరికిందన్నారు.

ఆన్ని విధాల ఆదుకుంటా..

మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లిపూడి వెంకటయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక దొరువుల పాలెం పంచాయతీలోని రొయ్యలపాలెంలో చనిపోయిన వెంకటయ్య ఇంటికి జగన్ మంగళవారం రాత్రి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటయ్య భార్య మస్తానమ్మ, కుమార్తె విజయతో మాట్లాడుతూ.. మీ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా ఫోన్ చేయవచ్చని తన ఫోన్ నంబరు ఇచ్చారు.