Saturday, January 22, 2011

వీరికి జేజేలు లేవు... * జనం మదిని గెలవని ప్రభుత్వ పెద్దలపై జగన్ ధ్వజం

‘నాన్న బతికున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో బతికి ఉన్నామన్నదే గొప్ప సంగతీ అనేవారు. కానీ ప్రస్తుత పాలకులు కనీసం బతికి ఉన్నప్పుడు కూడా జేజేలు కొట్టించుకోలేకపోతున్నారు. తమ గోడు వినేవారు లేక సామాన్యులు ఆకాశం వైపు చూసి దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపు అని వేడుకుంటున్నారు’ అని యువనేత వైఎస్ జగన్ ప్రభుత్వ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో చివరి రోజు శుక్రవారం ఓదార్పు యాత్రలో భాగంగా పాతగాజువాకలో ఆయన మాట్లాడారు.

‘వరదల మీద వరదలు, దెబ్బ మీద దెబ్బ పడుతోందని లక్ష మంది రైతులు కలిసి విజయవాడలో దీక్ష చేస్తే వారికి న్యాయం చేయరు.. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు అన్యాయంగా ఉందని, రాష్ట్రం పూర్తిగా ఎడారిగా మారుతుందని ఢిల్లీలో రోజంతా దీక్ష చేస్తే ప్రజల గోడు వినేందుకు ప్రధానమంత్రికనీసం ఐదు నిమిషాలు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరు. వైఎస్ బతికున్నప్పుడు పోలవరం పనులు చకచకా నడిస్తే.. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉంది. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వరు? అని అడుగుతున్నా.. రాష్ట్రం అథోగతి పాలవుతుంటే పట్టించుకునే నాథుడేడీ అని అడుగుతున్నా..’ అంటూ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు.


గాజువాకలో జనహోరు..
విశాఖ జిల్లాలో పదో రోజైన ఓదార్పు యాత్ర శుక్రవారం విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. నగరంలోని రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. గురువారం రాత్రి గాజువాకలో బస చేసిన జగన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు పెదగంట్యాడలో విగ్రహావిష్కరణతో యాత్ర ప్రారంభించారు. ఇక్కడ మొదలైన జనహోరు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంటలోగా పెదగంట్యాడ, సీతానగరం, దేశపాత్రునిపాలెం, గౌతు లచ్చన్ననగర్, అగనంపూడి సెంటర్లలో విగ్రహాలు ఆవిష్కరించారు. తరువాత కూర్మన్నపాలెం, శ్రీనగర్, డ్రైవర్స్‌కాలనీలలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి పాతగాజువాక సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడి విగ్రహావిష్కరణకు భారీగా జనం తరలివచ్చారు. ఈ హైవే జంక్షన్‌లో జనం కిక్కిరిసిపోయారు.

ఇక్కడి నుంచి కొత్తగాజువాక, బీసీరోడ్డు తదితర ప్రాంతాల రహదారుల్లో జనం పోటెత్తారు. కొత్తగాజువాక, బీసీరోడ్డులలో విగ్రహాలు ఆవిష్కరించాక.. సాయంత్రం 6.30కు ఆనందపురం చేరుకున్నారు. ఆనందపురం అంతా ఒక్కటై సెంటర్‌కు తరలివచ్చింది. అనంతరం వెల్లంకిలో విగ్రహావిష్కరణ చేసి తగరపువలస వైజంక్షన్ చేరుకున్నారు. ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించి పట్టణ కూడలిలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కూడలి జనసంద్రంగా మారింది. మూడు గంటలు ఆలస్యమైనా జనం ఓపిగ్గా నిరీక్షించారు. ఇక్కడి నుంచి జగన్ రాత్రి 8.50కి చిల్లపేట చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత భీమిలిలో రెండు విగ్రహాలు ఆవిష్కరించి, పసుపులేటి వెంకటరమణ కుటుంబాన్ని ఓదార్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత 11 గంటలకు గంభీరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత బోరవాని పాలెం, కొమ్మది జంక్షన్, చంద్రంపాలెం, 12.30కు పీఎం పాలెంలలో విగ్రహాలను ఆవిష్కరించారు.

నిర్వాసితులకు బాసట

ఉదయం అగనంపూడిలో జగన్ మాట్లాడుతూ ‘విశాఖకు స్టీలు ప్లాంటు రావాలని 1969 నుంచి 71 వరకు జరిగిన ఉద్యమంలో 52 మంది ప్రాణ త్యాగం చేశారు. ఆ త్యాగాలతో వచ్చిన ప్లాంటుకు స్థానికులు 28 వేల ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్ కార్డుల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. కానీ వైఎస్సార్ ఏ ఒక్కరినీ గాలికి వదిలేయలేదు. స్టీలు ప్లాంటు విస్తరణ జరిగేటప్పుడు నిర్వాసితులు అందరికీ ఉద్యోగాల్లో 50 శాతం కేటాయింపును ఇస్తూ ఆర్ కార్డులు పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది..’ అని అన్నారు.

విశాఖలో ముగిసిన ఓదార్పు..

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారంతో ఓదార్పుయాత్ర ముగిసింది. తొలివిడతలో జనవరి 3 నుంచి 8 వరకు సాగగా.. మలివిడత 18వ తేదీ నుంచి శుక్రవారం వరకు కొనసాగింది. మహానేత మరణ వార్త విని ప్రాణాలు కోల్పోయిన 18 మంది అభిమానుల కుటుంబాలను జగన్ ఈ ఓదార్పు యాత్రలో పరామర్శించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 200 విగ్రహాలు ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జన దీక్ష: అంబటి

రాష్ట్ర ప్రజల కష్టాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. సాగర తీరంలో యువనేత నిర్వహిస్తున్న జన దీక్ష ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. జగన్ ఉద్యమంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంపై స్పందిస్తూ కాంగ్రెస్‌లో రచ్చ ఎపుడో మొదలయిందని, ప్రస్తుతం బండే మిగిలుందన్నారు.

Saturday, January 8, 2011

ఆదుకుంటా.. అండగా ఉంటా..

విశాఖ జిల్లా నాతవరం వుండలం ఎం.బి.పట్నంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన ఉలబాల అక్కయ్యువ్ము కుటుంబాన్ని జగన్ శనివారం సాయుంత్రం ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని, అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి వురణాన్ని తట్టుకోలేక గత 2009 సెప్టెంబర్ 3న అక్కయ్యువ్ము మృతి  చెందింది. ఎలాంటి కష్ట మొచ్చినా ఆదుకుంటానని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆమె భర్త నూకరాజును, పెద్దకొడుకు పెదనూకరాజును ఓదారుస్తూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరేమి పనులు చేస్తున్నారంటూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

అక్కయ్యువ్ముకు ముగ్గురు కొడుకులుండగా వారిలో ఇద్దరికి వివాహమై వ్యవసాయు కూలీలుగా పనిచేస్తున్నారు. మూడో కొడుకు ఉలబాల లోవ బీఎస్సీ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నానని, దారి చూపాలని అతను జగన్‌ను కోరాడు. తప్పకుండా ఆదుకుంటావుని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. సువూరు పది నిమిషాలపాటు అక్కడ గడిపారు. యువనేతతోపాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రావుకృష్ణ, ఎం.బి.పట్నం సర్పంచ్ వర్రె సత్యనారాయుణ ఉన్నారు.

Thursday, January 6, 2011

ఉద్విగ్న క్షణాలు..

చెమ్మగిల్లిన నయనాలు.. మౌన వేదనతో కరువైన మాటలు.. ఇవీ అక్కడ నెలకొన్న ఉద్విగ్న క్షణాలు.. మహానేత వైఎస్ అకాల మరణంతో గుండె ఆగి చనిపోయిన మజ్జి కొండబాబు కుటుంబాన్ని యువనేత జగన్ బుధవారం ఓదార్చారు. ఇందుకోసం ఆయన ఇసుకగరువుకు చేరుకోగానే స్థానిక గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జగన్ కొండబాబు ఇంట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండబాబు భార్య రత్నాలమ్మ, కుమారులు శ్రీను, రవిలను పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ను చూడగానే కొండబాబు కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి ఆవేదన చూసి యువనేత కళ్లు చెమర్చాయి. దీంతో కొద్ది నిమిషాలు ఉద్విగ్నంగా గడిచాయి. యువనేత కొంత సమయానికి తేరుకుని.. ఎలాంటి కష్టమొచ్చినా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారిచ్చిన చోడి అంబలిని ఎంతో ఇష్టంగా సేవించారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన గిరిజనులందరినీ జగన్ పలకరించి ముందుకు సాగారు.

కష్టసుఖాల్లో తోడునీడగా..
కష్టసుఖాల్లో అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేయమని మల్లవరపు పెదకొండబాబు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక కింతలివల్లాపురానికి చెందిన కొండబాబు మనోవేదనతో మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటలకు జగన్ వారింటికి చేరుకొని మృతుని భార్యను, ఇద్దరు పిల్లల్ని ఓదార్చారు. సుమారు 20 నిమిషాలపాటు వారి ఇంట గడిపి చిన్నారులు మల్లిక, తరుణ్‌లను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. కొండబాబు తల్లిదండ్రులు రాజు, పైడమ్మ, చెల్లెలు రత్నంతో మాట్లాడారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. తమ ఇంటికి వచ్చి కన్నీరును తుడిచిన జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని మృతుడి భార్య, తల్లిదండ్రులు చెప్పారు.

Tuesday, January 4, 2011

నేనున్నానని...

విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో వైఎస్ దుర్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని యువనేత జగన్ మంగళవారం ఓదార్చారు. సన్యాసి ఇంటికి వెళ్లి ఆమె భార్య మహాలక్ష్మమ్మ, కుమారుడు అప్పారావు, కోడలు లక్ష్మి, కుమార్తె వరలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌కు వీరాభిమానిగా ఉన్న సన్యాసి ఆయన మరణవార్త విన్నప్పట్నుంచీ దిగాలుగా ఉండేవాడని, 2009 సెప్టెంబరు 5న మహానేత చిత్రపటం ఊరేగింపును చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలాడని కుటుంబ సభ్యులు జగన్‌కు తెలిపారు. కాసేపటికే ఆయన మరణించాడని వివరించారు. తమకు సొంతిల్లు కూడా లేదని, సన్యాసి మరణంతో తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని విలపించారు. సన్యాసికి ప్రతి నెలా వచ్చే పింఛనును తమ కుటుంబంలో ఒకరికి ఇప్పించాలని ప్రాథేయపడ్డారు. దీనిపై స్పందించిన జగన్ మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. యువనేత తమను ఓదార్చడానికి వచ్చినందుకు సన్యాసి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పండ్లు తినిపించారు.
అండగా నేనుంటా...
రావికమతం (విశాఖ జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గౌరీపట్నంలో మృతిచెందిన కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్చారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకునాయుడు ఇంటికి చేరుకున్న జగన్.. ఆయన భార్య నారాయణమ్మ, కుమార్తెలు జగ్గయ్యమ్మ, రమాదేవి, చంద్రలక్ష్మిలను పరామర్శించారు. జగన్‌ను చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంకునాయుడు వైఎస్‌పై ఎంతో మమకారం చూపించేవారని చెప్పారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్తలు టీవీలో చూస్తూనే చనిపోయాడని వివరించారు. వారి కన్నీళ్లు తుడిచిన జగన్.. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. 
కన్నమ్మ ప్రేమ..
ఆమె వయస్సు 90 ఏళ్లు. పేరు కన్నమ్మ. విశాఖ జిల్లా చోడవరంలోని యడ్లవీధిలో ఉంటోంది. ఎవరైనా చేయందిస్తేనేగాని కూర్చొని లేచే ఓపిక లేదు. అలాంటి స్థితిలో ఊతకర్ర చేత పట్టుకుని పడుతూ లేస్తూ జనసంద్రంలోకి ప్రవేశించింది. ‘ఆ మారాజు (వైఎస్) కొడుకు జగన్‌బాబొచ్చేడంట కదా? ఎక్కడున్నాడు బాబూ..? అంటూ జనాన్ని తప్పించుకుంటూ సభా వేదిక సమీపంలోకి వచ్చింది. అదీ ఒట్టి చేతుల్తో కాదు.. తనకు వైఎస్ పుణ్యాన వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని!

‘ఆ బాబు (వైఎస్) పున్నాన్ని (పుణ్యాన) నెలకి రెండొందలు పించిణీ (పెన్షన్) తీస్కుంటున్నాను. ఆరోగ్గం బాలేకపోతే ఈ కార్డుతో బాగు సేయించుకున్నాను. నా పెనిమిటి (భర్త) లేడు, పిల్లలూ లేరు. ఒక్కదాన్నే ఉంటున్నాను. కళ్లు కూడా బాగా ఆనడం లేదు. ఆ బాబును (జగన్)ను సూసిపోదామనొచ్చేను. సూపించరు బాబూ...’ అని అడగ్గా.. అక్కడున్న వారు అదుగో... అతనే జగన్‌బాబు... చూడు అంటూ చూపించారు. యువనేతను చూసిన సంబరంతో.. ‘నా నాయనే సల్లంగా ఉండు’ అని దీవించింది.

Monday, January 3, 2011

విశాఖే కదిలి వచ్చింది * జగన్ కోసం తరలివచ్చిన జనప్రవాహం - కిక్కిరిసిపోయిన రోడ్లు.

* 11న ఢిల్లీ దీక్ష నేపథ్యంలో 10 నుంచి విశాఖ ఓదార్పుకు విరామం
* సంక్రాంతి తర్వాత పునఃప్రారంభం



విశాఖ జనమంతా వీధుల్లోకి వస్తే.. ఆ వీధులన్నీ మెయిన్‌రోడ్డువైపే పరుగులు తీస్తే... ఆ రోడ్లు ఇసుకవేస్తే రాలనంతలా కిక్కిరిసిపోతే... అదంతా ఒకే ఒక్కనాయకుడి కోసమైతే.. సోమవారం ఇదే దృశ్యం విశాఖలో ఆవిష్కృతమైంది. ఓదార్పుయాత్ర కోసం వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగాస్వాగతం పలికేందుకు, నీ వెంట మేమున్నామని చాటేందుకు జనం రోడ్లపైకి వచ్చారు. విమానాశ్రయం మొదలు యువనేత సాగిన ప్రతిదారీ జనసంద్రాన్ని తలపించేలా వచ్చిన అభిమానులు జగన్‌ను తమ ఆత్మీయ బంధువుగా అక్కున చేర్చుకున్నారు. జై జగన్ నినాదాలతో యువకులు ర్యాలీలుగా వెంట రాగా.. మహిళలు భారీ సంఖ్యలో బారులు తీరి స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికారు.

కట్టలు తెంచుకున్న అభిమానం..
జిల్లాలో 18 కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30కు విమానాశ్రయంలో దిగిన ఆయన.. వేలాది మంది తరలివచ్చినా.. అక్కడి నుంచి వడివడిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనం పోటెత్తడంతో దగ్గరలో ఉన్న ఎన్‌ఏడీ జంక్షన్ చేరేసరికి 45 నిమిషాలు పట్టింది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి.. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కంపర బాబూరావు కుటుంబాన్ని ఓదార్చేందుకు 2.40కి పద్మనాభనగర్ చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి 4.30కు నాయుడుతోటలో, 4.55కు వేపగుంటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.

ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు.. చివరికి అన్నం తింటున్నప్పుడు కూడా నాన్నను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారని.. ప్రతి ఒక్కరితో వైఎస్‌కున్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, పేదవాళ్లు, వైఎస్‌ను ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారో చెబుతూ జగన్ ముందుకు కదిలారు. సాయంత్రం 6.00 గంటలకు సింహాచలం చేరుకున్నారు. దారి పొడవునా ప్రతి పల్లెలో జనం జగన్‌కు స్వాగతం పలికారు. 6.40 సింహాద్రి అప్పన్నను దర్శించుకుని 8.10కి శొంఠ్యాం దగ్గర గండిగుండెం జంక్షన్ చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 8.30కు నీళ్లగుండీలు గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కాలనీవాసులు తమ కాలనీకి వైఎస్‌ఆర్ కాలనీ అని పేరుపెట్టుకుని తమ అభిమానం చాటుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు గుర్రంపాలెం చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని..
9.25కు పెందుర్తి మండల కేంద్రానికి చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు.. దేశానికి చాటిచెప్పిన వ్యక్తి వైఎస్’ అని గుర్తు చేసుకున్నారు. మాట ఇస్తే నష్టమైనా కష్టమైనా నిలబడాలని చెప్పేవారని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతుండేవారని జగన్ ప్రసంగిస్తున్నప్పుడు జనం జగన్‌కు జేజేలు పలికారు. వైఎస్ జోహార్ అంటూ నినదించారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన వ్యక్తి వైఎస్ అని చెబుతున్నప్పుడు జనం చప్పట్లతో హోరెత్తించారు.

ఆ మహానుభావుడు బతికే ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నప్పుడు.. అవునూ.. అవునూ.. అంటూ నినదించారు. రాత్రి 10 గంటలకు సుజాతనగర్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 10.20కి రామాపురంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి గండి భూలోకయ్య కుటుంబాన్ని ఓదార్చారు. 11 గంటలకు పినగాడి జంక్షన్, 11.30కు సబ్బవరంలో విగ్రాహావిష్కరణలకు జనం కిక్కిరిసిపోయారు. తర్వాత లింగాలతిరుగుడులో దొడ్డి కోటేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చిన యువనేత 12.45 గంటలకు అడ్డూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అర్ధరాత్రి దాటాక కూడా యాత్ర కొనసాగుతోంది.

ఓదార్పుకు విరామం
11న ఢిల్లీలో దీక్ష చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 10వ తేదీ నుంచి విశాఖ ఓదార్పుకు జగన్ విరామం ఇవ్వనున్నారు. సంక్రాంతి తర్వాత యాత్ర పునఃప్రారంభమవుతుంది.

ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి
‘మీకు అండగా ఎవరూలేరని అనుకోకండి.. మీకే కష్టమొచ్చినా నేనున్నాను.. అవసరమైతే ఫోన్ చేయండి’ అంటూ కంపర బాబూరావు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. విశాఖలోని గోపాలపట్నం శివారు పద్మనాభనగర్‌లో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన బాబూరావు ఇంటికి సోమవారం మధ్యాహ్నం యువనేత వెళ్లారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కంటతడి పెట్టుకున్న బాబూరావు తల్లి అప్పలనర్సమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబ పరిస్థితి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ నాన్న చనిపోయిన బాధలోఉన్నా మా కోసం వచ్చావా బాబూ...’ అంటూ అప్పలనర్సమ్మ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. బాబూరావు సోదరుడు నాగరాజు, సోదరి కన్నమ్మల బాగోగులను యువనేత అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం ఆప్యాయంగా పెట్టిన స్వీట్లు, పండ్లు తిన్నారు.
భూలోకయ్య కుటుంబానికి భరోసా...
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన గండి భూలోకయ్య కుటుంబాన్ని యువనేత జగన్ సోమవారం రాత్రి పదిన్నర గంటలకు పరామర్శించారు. భూలోకయ్య భార్య నాయుడమ్మ, కుమారులు భీముడు బాబు, గణపతిరావు, భూషణరావులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పదోతరగతి చదువుతున్న కుమార్తె రూప ఉన్నత చదువులకోసం సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. నాయుడమ్మ చేతుల మీదుగా పాయసం, యాపిల్ పండు ముక్కలు, పిల్లల చేతుల మీదుగా స్వీట్లు తిన్నారు. వారికి ఏసమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. తన ఫోన్ నంబర్ ఇచ్చి సమస్యల్లో ఆసరాగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడకు వచ్చిన మహిళలు జగన్‌కు అభిమానంతో రాఖీలు కట్టారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. పదినిమిషాలపాటు ఆ ఇంట గడిపిన జగన్ 10.50గంటలకు బయటకు వచ్చి యాత్ర కొనసాగించారు.