Sunday, November 7, 2010

జన సునామీ * ఓదార్పుకు స్పందన అనూహ్యం

బంగాళాఖాతంలో‘జల్’పెను తుపాను.. తీరంలో అల్లకల్లోలం... జిల్లా వ్యాప్తంగా వర్షాలు... ఇది ఆదివారం ఉదయం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పుయాత్ర ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగు తుందోనని ఆయన అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.

ఉదయం నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు. సాధారణంగా వర్షం కురిస్తే మోకాటిలోతు నీళ్లు నిలిచే నెల్లూరు ప్రధాన రోడ్లు, వీధులు ‘జన’మయమయ్యాయి. వర్షం వస్తే బోసిపోయే రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. జోరు వర్షంలోనూ కదలని జనం. కురుస్తున్న వర్షం చినుకులు రోడ్డు మీద పడని పరిస్థితి. ఇదీ ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటరులో కనిపించిన దృశ్యాలు.

యువనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో చివరిరోజు ఓదార్పుయాత్రను నిర్వహించారు. అభిమానులు కడలి కెరటాల్లా తరలివచ్చి యువనేతకు నీరాజనం పలికారు. కటౌట్లు, ఫ్లెక్సీ బోర్డులు, భవనాలు, మిద్దెలు, దుకాణాలు, ట్రాఫిక్ డివైడర్లు, ఐల్యాండ్లు ఇలా ప్రతి చోటూ జనంతో నిండిపోయాయి. యువతనేతను ఆత్మీయంగా పలుకరించాలని ఉదయం నుంచి నగరవాసులు ఎదురుచూశారు, బొకేలు, పూలమాలలు చేతబట్టి రోడ్లపై చేరారు.
నెల్లూరు నగరంలోని మనోహర్‌రెడ్డి నివాసం నుంచి జిల్లాలో చివరి రోజు ఓదార్పుయాత్రను జగన్ ప్రారంభించారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులతో మనోహర్‌రెడ్డి నివాసం కిక్కిరిసిపోయింది.

అక్కడకి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగిన జగన్ నీలగిరి సంఘానికి చేరుకుని మహబూబ్‌బాషా కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌కు బయలుదేరిన జగన్‌పై అడుగడుగునా జనం అభిమానం కురిపించారు. చిరుజల్లులు కురుస్తున్నా జనం ఖాతరుచేయలేదు. విద్యార్థులు, యువకులు, చిన్నారులు, మహిళలు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మహిళలు జగన్‌కు దిష్టి తీయడంతో పాటు మంగళ హారతులిచ్చారు. అభిమాన బంధాలను దాటుకుంటూ జగన్ గాంధీబొమ్మ సెంటర్ సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికే గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్, కనకమహాల్ సెంటర్, ఏసీ సెంటర్‌ల వరకూ జనం కిటకిటలాడుతున్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో తరలివచ్చిన జనం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ప్రతి ఒక్కరూ జగన్ చేతి స్పర్శ కోసం పోటీపడ్డారు. వాహనాన్ని విగ్రహావిష్కరణ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

జగన్ వేదికపైకి చేరుకోగానే ఆ ప్రాంతం కాబోయే సీఎం..జగన్ అనే నినాదాలతో హోరెత్తింది. అనంతరం నిలువెత్తు వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటికే వర్షం మొదలైనా జనం లెక్కచేయలేదు. జగన్ చేసిన ప్రసంగాన్ని వింటూ విశేషరీతిలో స్పందించారు. జగన్ ప్రసంగం మొదలైన సమయంలో తుంపర్లుగా పడుతున్న వర్షం ముగిసే సమయానికి జోరువానగా మారింది. అయినప్పటికీ జనం వెనకడుగు వేయకుండా ఆసక్తికరంగా సాగిన జగన్ ప్రసంగాన్ని విన్నారు.

చివర్లో సీఎం..సీఎం...సీఎం..సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, సినీ నటి రోజా, సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు. గట్టు రామచంద్రరావు, పుల్లా పద్మావతి, కాటం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, రెహమాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరుల ప్రసంగాలకు కూడా జనం నుంచి విశేష స్పందన లభించింది. జోరువాన కురుస్తున్నా జగన్ అక్కడి నుంచి వెళ్లేంత వరకు జనం కదలకపోవడం విశేషం. అక్కడి నుంచి డైకస్‌రోడ్డు సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

వర్షంలోనూ ప్రజలు హాజరుకావడంతో వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. వైఎస్సార్‌పై ఇంతటి ఆదరాభిమానాలను ప్రదర్శించడం హర్షణీయమన్నారు. సీఏఎం స్కూలు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ వైఎస్సార్‌పై స్థానిక ముస్లింనేత ఆలపించిన గీతాన్ని జగన్ ఎంతో ఆసక్తిగా విన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జేకేరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సన్నీ హైట్స్ హోటల్ అధినేత బలరామిరెడ్డి నివాసంలో భోజనానికి హాజరయ్యారు. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు, వెంకటాచలం మండలం గొలగమూడి, అనికేపల్లి, తిక్కవరప్పాడులలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి చెన్నైకు బయలుదేరారు.
నగరంలోని బట్వాడిపాళెం చర్చిలో జననేత ప్రార్థనలు చేశారు. తదుపరి కనుపర్తిపాడు వెళుతూ మార్గమధ్యలో మాజీ కౌన్సిలర్ మాథ్యుస్ కోరిక మేరకు కొండాయపాళెం బాప్టిస్టు చర్చి వద్ద ఆగారు. చర్చిలో ప్రార్థన చేసి మతపెద్దలు ఆశీస్సులు పొందారు. 
 
ఓదార్పుకు స్పందన అనూహ్యం
ఓదార్పుయాత్రలో భాగంగా యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలో ఓదార్పుయాత్ర ప్రారంభం నుంచి ప్రజల హృదయాలను తాకేలా ఆయన మాట్లాడారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి చోటా ఆయన ప్రస్తావించారు. ఆ పథకాల పేర్లను ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఒక్కో పథకం పేరు చెబితే చాలు జనంలో నుంచి వైఎస్సార్..వైఎస్సార్..వైఎస్సార్ అని సమాధానం వచ్చేది.

దివంగత నేత వైఎస్సార్ మాదిరిగానే 108 వాహన సేవలను వివరించినప్పుడు ఆయన చెప్పే కుయ్..కుయ్..కుయ్ పదాలకు జనం కూడా శృతి కలిపారు. ప్రధానంగా జగన్ ఉచ్చరించే గుర్తుకొస్తూనే ఉంటారు...అనే మాటకు జనంలో నుంచి కేరింతలు వెల్లువెత్తాయి. ఆయన తన ప్రసంగాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ పథకాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రెండు రూపాయలకే కిలోబియ్యం, పావలా వడ్డీకి రుణాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను వివరించినప్పుడు జనం మరొక్కసారి దివంగతనేత వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు.

జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ విగ్రహా విష్కరణ కార్యక్రమాల్లో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తమకు వైఎస్సార్ చేసిన మేలును వివరించేందుకు వేదికల మీదకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమకు రెండు నిమిషాలు అవకాశమిస్తే మహానుభావుడు వైఎస్సార్ చేసిన ఉపకారాన్ని వివరించి తృప్తి పడతామని కోరారు. జగన్ వారందరికీ అవకాశం కల్పించారు. అలా వారు చేసిన ప్రసంగాలకు జగన్‌తో పాటు జనం కూడా మురిసిపోయారు.
ముగింపు ప్రసంగం అదరహో..

ఓదార్పుయాత్ర ఆఖరురోజైన ఆదివారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహా విష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ఓదార్పుయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ అవాకులు, చవాకులు పేలుతున్న వారిపై నిప్పులు చెరిగారు. కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావులు ఏం చేశారని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌ను ఒంటరి చేయలేరన్నారు. ప్రతిపక్షం కంటే స్వపక్షనేతలే తనపై అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు తనను నమ్ముకున్న వారిని పథకం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్నవారికి నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇలా చేయడం న్యాయమా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి కాదు..కాదు..కాదు..అని జనంలో నుంచి సమాధానం వచ్చింది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నిన వారి పాపాలు పండి.. వచ్చే ఉప్పెనలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ విధంగా జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలూ అదే స్థాయిలో స్పందిం చారు. మేమున్నామంటూ నినాదాలు చేశారు. చివర్లో కాబోయే సీఎం..కాబోయే..కాబోయే సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంపై పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు. 
 
ఓదార్పులో ప్రముఖులు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో 23 రోజుల పాటు నిర్వహించిన ఓదార్పుయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, మూలింటి మారెప్ప, సినీ నటి రోజా, సినీనటులు ధర్మవరపు సుబ్రమణ్యం, విజయ్‌చందర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, వైఎస్సార్ జిల్లా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కందుల రంగారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ఆర్. ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్, ఎమ్మెల్సీలు రెహమాన్, పుల్లా పద్మావతి, కొండా మురళి, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్, లాయర్ పత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్లు డేగా నారసింహారెడ్డి, బాలచెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, అల్లాడి సతీష్ కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రజని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు జీవీ ప్రసాద్, ఇసనాక సునీల్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, కండ్లగుంట వెంకటేశ్వర్లురెడ్డి, కన్నపరెడ్డి అమరనాథ్‌రెడ్డి, అంకినపల్లి ఓబుల్‌రెడ్డి, కోనంకి శ్రీనివాసులునాయుడు, శివారెడ్డి, సాయిరాంరెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment